హైదరాబాద్: హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారంటూ.. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన కామెంట్స్కు నిరసనగా ఎన్ఎస్యూఐ హైదరాబాద్లోని కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. అటు ఎమ్మెల్యేకు మద్ధతుగా బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు సైతం అక్కడికి చేరుకున్నాయి. ఆయన నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు, హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిన్న సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్.. ప్రైవేట్ హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారని, అర్థరాత్రి 2 గంటలకు ఆయన ఏ హీరోయిన్ దగ్గరకు వెళ్తున్నారో అందరికి తెలుసు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డిపై ఈడీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.