హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలు, హాస్టళ్లలో పని చేస్తున్న డైలీవేజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు 6 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. నెలల తరబడి ప్రభుత్వం వేతనాలు చెల్లించకుంటే చిరు ఉద్యోగులు ఎలా బతుకుతారు? అని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ బతుకమ్మ, దసరా పండుగ సంబురం లేకుండా చేయడం దుర్మార్గమని అన్నారు.
''వేతనాలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులకు ఆశ్రమ పాఠశాల్లలో, హాస్టళ్లలో సరైన సేవలు అందటం లేదు. ఇది విద్యార్థుల ఆరోగ్యంపై, వారి చదువులపై ప్రభావం చూపుతున్నది. సమస్యలు పరిష్కరించాలంటూ అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. విసిగిపోయిన ఉద్యోగులు చివరకు సమ్మెబాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించిన వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని, వారి ఇతర సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం'' అని అన్నారు.