10 వేల మందితో బతుకమ్మ ఉత్సవం, ఏర్పాట్లపై సీఎస్ కీలక ఆదేశాలు

29న నిర్వహించే కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డ్‌లో నమోదయ్యే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు.

By -  Knakam Karthik
Published on : 25 Sept 2025 7:10 AM IST

Hyderbad News, Government Of Telangana, Bathukamma Festival, CS Ramakrishnarao

10 వేల మందితో బతుకమ్మ ఉత్సవం, ఏర్పాట్లపై సీఎస్ కీలక ఆదేశాలు 

హైదరాబాద్: ఈనెల 29 న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించే భారీ బతుకమ్మ కార్యక్రమంతో పాటు, 26న రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే బతుకమ్మ కుంటలో బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయడానికి సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. 29న నిర్వహించే కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డ్‌లో నమోదయ్యే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై నేడు సంబంధిత ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.

ఈ సందర్భంగా సి.ఎస్. మాట్లాడుతూ, అంబర్ పేట్ లో ప్రభుత్వం పునరుద్ధరించిన బతుకమ్మకుంటలో నిర్వహించే బతుకమ్మ సంబరాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి 26న పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలతో హాజరవుతున్నందున తగు ఏర్పాట్లను చేపట్టాలని జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులను ఆదేశించారు. బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానాలను ప్రజాప్రతినిధులు, వీఐపీ లకు సకాలంలో పంపించాలని జీహెచ్ఎంసీ కమీషనర్ ను ఆదేశించారు. సాయంత్రం 4 గంటల నుండే పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మ కుంటకు చేరుకునే అవకాశమున్నందున శానిటేషన్, తగు బందోబస్తు, తాగునీటి సదుపాయం తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని అన్నారు.

అదేవిధంగా, 29 న సరూర్ నగర్ స్టేడియంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ కార్యక్రమం గిన్నెస్ బుక్ రికార్డ్ లో నమోదయ్యే అవకాశం ఉందని, ఈ కార్యక్రమంలో దాదాపు 10 వేలకు పైగా మహిళలు బతుకమ్మలతో హాజరవుతారని వెల్లడించారు. సరూర్ నగర్ స్టేడియంలోనూ మహిళలకు మౌలిక సదుపాయాల ఏర్పాటు తో పాటు స్టేజి ఏర్పాట్లు, విద్యుదీకరణ, శానిటేషన్ లను చేపట్టాలని రామకృష్ణా రావు స్పష్టం చేశారు. వీటితో పాటు, 27 న ట్యాంక్ బండ్ పై సాయంత్రం బతుకమ్మ కార్నివల్, 29 న పీపుల్స్ ప్లాజా, 30 న ట్యాంక్ బండ్ పై పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశామని టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు. ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయడానికి సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని అన్నారు

Next Story