హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. చేనేత కార్మికుల సంక్షేమం కోసం తీసుకువచ్చిన 'తెలంగాణ నేతన్నకు భరోసా' పథకంకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. తాజాగా నేతన్నలకు సాయం చేసే భరోసా పథకం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం వివరాలు, అర్హతలను వెల్లడించింది. జియో ట్యాగ్ చేసిన మగ్గాలపై పని చేస్తున్న నేతన్నలకు రూ.18,000. అనుబంధ కార్మికులకు రూ.6 వేల ప్రోత్సాహంం అందించనుంది. ఏడాదికి రెండు విడతలుగా అందించనున్న ఈ ప్రోత్సాహం కింద 40 వేల మంది చేనేత, అనుబంధ కార్మికులకు లబ్ధి చేకూరనుంది.
కాగా నేతన్నకు భరోసా పథకం కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.48 కోట్లు కేటాయించింది. 18 సంవత్సరాలు నిండిన నేత, అనుబంధ కార్మికులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. జియో ట్యాగ్ చేయబడిన మరమగ్గాలపై పనిచేసే కార్మికులు అర్హులని తెలిపింది. ప్రీలూమ్, ప్రిపరేటరీ పనులైన డైయింగ్, టైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైండింగ్, సైజింగ్ వంటి అనుబంధ పనులు చేసే కార్మికులు కూడా ఈ పథకానికి అర్హులు అని మార్గదర్శకాల్లో పేర్కొంది. చేనేత వృత్తి ద్వారా వారి వార్షిక ఆదాయంలో కనీసం 50 శాతం పొందుతున్నవారు అర్హులుగా గుర్తించబడతారు. ఈ పథకం కింద అర్హులైన నేత, అనుబంధ కార్మికులకు వేతన ప్రోత్సాహకం నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోనే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.