TSPSC: గ్రూప్‌-2 వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌ -2 పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ పరీక్షలను నవంబర్‌లో నిర్వహించనుంది.

By అంజి  Published on  13 Aug 2023 1:15 AM GMT
Group 2 exam, Telangana, exam postpone, CM KCR

TSPSC: గ్రూప్‌-2 వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌ -2 పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ పరీక్షలను నవంబర్‌లో నిర్వహించనుంది. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్‌-2 వాయిదా కోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలోనే గ్రూప్‌ 2 పరీక్షా అభ్యర్థుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్నారు సీఎం కేసీఆర్‌. ఆయన ఆదేశాల మేరకు పరీక్షల రీ షెడ్యూల్‌కి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిన్న టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌, కార్యదర్శితో సమావేశమయ్యారు. అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి, పరిస్థితులను సీఎంకు తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు పరీక్షలను నవంబరుకు వాయిదా వేసినట్లు సీఎస్‌ శనివారం రాత్రి ప్రకటించారు.

ఈ మేరకు శనివారం పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేస్తూ.. లక్షలాది మంది అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు టీఎస్‌పీఎస్‌సీతో సంప్రదింపులు జరిపి గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని చీఫ్ సెక్రటరీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారని అంతకుముందు ట్విటర్‌లో తెలిపారు. "భవిష్యత్తులో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ల యొక్క సరైన అస్థిరత ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్‌.. చీఫ్ సెక్రటరీకి సలహా ఇచ్చారు. అలాగే ప్రతి ఔత్సాహికుడికి అన్ని అర్హత గల పరీక్షలకు సిద్ధం కావడానికి తగిన సమయం లభిస్తుంది" అని ఆయన చెప్పారు. గ్రూప్‌-2కు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే సన్నాహాలు జరిగాయి. కాగా గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు అభ్యర్థులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Next Story