హైదరాబాద్: ప్రభుత్వ స్కూళ్లలో స్పెషల్ క్లాసులకు హాజరయ్యే 10వ తరగతి విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకు దీనిని అమలు చేయనుంది. ఉడకబెట్టిన పెసర్లు, బొబ్బర్లు, పల్లి పట్టీ, మిల్లెట్ బిస్కెట్లు, ఆనియన్ పకోడీ, శనగలు అందించాలని ఆదేశించింది. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యా డైరెక్టర్ నరసింహ రెడ్డి జనవరి 29, 2025న అన్ని జిల్లాల డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు.
ఫిబ్రవరి 1, 2025 నుండి మార్చి 20 వరకు మొత్తం 38 పని దినాలకు స్నాక్స్ అందించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 21, 2025 నుండి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 22న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24న ఇంగ్లీష్, మార్చి 26న మ్యాథ్స్, మార్చి 28న ఫిజిక్స్, మార్చి 29న బయాలజీ, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి.