హైదరాబాద్లో లిక్కర్ వ్యాపారం పేరుతో కోట్ల రూపాయల దందాకు తెరలేపిన అంతర్జాతీయ మోసగాడు అక్కల రామకృష్ణ ప్రసాద్ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియా పౌరుడినని నమ్మబలికిన ఇతడు, నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ భారీ వసూళ్లకు పాల్పడ్డాడు. బేవరేజెస్ ఫ్యాక్టరీలు, పబ్బులు, లిక్కర్ లైసెన్సులు ఇప్పిస్తానని నమ్మించి నరేందర్ అనే వ్యాపారి నుంచి రూ. 1.30 కోట్లు కాజేశాడు. నిందితుడు విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి మరీ అతడిని పట్టుకున్నారు.
రామకృష్ణ ప్రసాద్ నేర చరిత్ర కేవలం హైదరాబాద్కే పరిమితం కాలేదు. ఆస్ట్రేలియాలో కూడా అనేక చీటింగ్ కేసుల్లో నిందితుడిగా ఉండి జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు గుర్తించారు. సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో పెట్టుబడుల పేరుతో మోసాలు చేయడమే కాకుండా, బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 4 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టిన ఉదంతం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితుడి తండ్రి వరప్రసాద్, సహచరుడు విక్రమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘరానా మోసగాడి చేతిలో చిక్కుకున్న బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే సీసీఎస్ పోలీసులను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.