వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిచి ఉన్న లారీనీ టూరిస్ట్ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పరిగి మండలం రంగాపూర్ సమీపాన బీజాపూర్ - హైదరాబాద్ నేషనల్ హైవేపై ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందిన పలువురు టూరిస్ట్ బస్సులో పరిగిలో జరిగిన ఓ శుభ కార్యక్రమానికి వెళ్లారు.
తిరిగి వస్తుండగా రోడ్డుపై నిలిపి ఉన్న లారీని బస్సు వెనుక ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.