నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళ గంగ వద్ద ప్రమాదం తప్పింది. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వచ్చిన ఓ యువకుడు కృష్ణా నదిలో ఈతకు దిగి ప్రమాదవశాత్తూ నీటిలో కొట్టుకుపోయాడు. అతడిని కాపాడేందుకు మిత్రులు ప్రయత్నించినా నీటి ప్రవాహం కారణంగా వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి అక్కడే ఉన్న స్థానిక మత్స్యకారుల సమయస్ఫూర్తి కారణంగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
యువకుడి ప్రాణం నిలిచిన ఈ ఘటనను చూసిన స్థానికులు, పర్యాటకులు మత్స్యకారుల ధైర్యాన్ని, సమయోచిత స్పందనను ప్రశంసించారు. కొద్దిసేపు ఆలస్యమైతే ప్రాణనష్టం తప్పకపోయేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, మత్స్యకారులను నిజమైన హీరోలుగా కొనియాడుతున్నారు.