తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. తాజాగా హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల ఉన్న భూములకు రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల 2.13 లక్షల ఎకరాల భూములు ఉన్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. అందులో 93,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్లు, సాగుకు అనుకూలం కాని భూములు ఉండటంతో రైతు భరోసా నిలిపివేశామన్నారు. మిగతా 1.20 లక్షల ఎకరాల భూమికి రైతు భరోసా వర్తింపజేస్తామని 2 నుంచి 3 రోజుల్లో వారికి సాయం చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
సాగు చేసే భూములకే ఈ పథకం వర్తింపజేయాలనే ఉద్దేశంతోనే ఆలస్యమైందని మంత్రి తుమ్మల వివరణ ఇచ్చారు. దీనిని బీఆర్ఎస్ నాయకులు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్నారని మంత్రి తుమ్మల విమర్శించారు. కాగా ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద 9 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు నిధులను విజయవంతంగా విడుదల చేసినట్లు చెప్పారు. శుక్రవారం వరకు 7 ఎకరాల భూమి ఉన్న రైతులకు నిధులు జమ చేయగా.. శనివారం 8, 9 ఎకరాలు ఉన్న రైతులకు కూడా సహాయం అందించినిట్లు తెలిపారు. 8 ఎకరాలున్న 67,352 మంది రైతులకు సంబంధించిన 4.42 లక్షల ఎకరాలకు రూ. 265.91 కోట్లు విడుదలచేశామన్నారు.