రైతుబంధు పథకాలతో.. తెలంగాణలో స్వర్ణయుగానికి నాంది

వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన

By అంజి  Published on  3 Jun 2023 5:46 AM GMT
Farmers, Telangana Government, Free Electricity, agricultural, Farmers support schemes

రైతుబంధు పథకాలతో.. తెలంగాణలో స్వర్ణయుగానికి నాంది

హైదరాబాద్: వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న సాగునీటితో బంజరు వ్యవసాయ భూమి సస్యశ్యామలంగా మారింది. వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న రైతుల ఆర్థిక సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందజేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అనేక కొత్త వ్యవసాయ సంస్కరణలను అవలంబించడం ద్వారా వ్యవసాయంలో అధిక దిగుబడి కోసం చర్యలు చేపట్టింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రైతుల సమస్యలను స్వయంగా చూశారు.

2014 జూన్ 2న ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం అధినేతగా అభివృద్ధి, సంక్షేమంపై అవగాహనతో సమగ్ర ప్రణాళిక రూపొందించి ఒక్కో సమస్యను దశలవారీగా పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రైతులు, వ్యవసాయ రంగ సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. దేశానికి వెన్నెముకలాంటి రైతులకు అండగా నిలిచేందుకు ముందస్తు వ్యూహం రచించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోంది. కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తోంది. తెలంగాణ సాగు విస్తీర్ణం 2 కోట్ల 16 లక్షల ఎకరాలకు పెరిగింది. ఆధునిక సాగు పద్ధతులు, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువుల లభ్యత పంట ఉత్పత్తి మరియు ఉత్పాదకతను అనేక రెట్లు పెంచాయి.

రైతు సంక్షేమంలో భాగంగా 27 లక్షల వ్యవసాయ మోటార్లకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం ఏటా రూ.10,000 కోట్లు వెచ్చిస్తోంది ప్రభుత్వం. విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ. 36,179 కోట్లు కేటాయించింది.

రైతుబంధు పథకం: పంట పెట్టుబడిలో రైతులకు సహాయం చేయడానికి వినూత్న విధానంతో రైతుబంధు పథకాన్ని దేశంలో ప్రవేశపెట్టారు. రైతుబంధు పథకం కింద రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏడాదికి పదివేలు అందజేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరువు, పేదరికంతో అల్లాడిన తెలంగాణ రైతు. పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీల కారణంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ముఖ్యమంత్రి రైతుబంధు పథకాన్ని ప్రారంభించి 65 లక్షల మంది రైతులకు ప్రతి సంవత్సరం ఎకరాకు రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తున్నారు. 2018 వర్షాకాలం నుంచి ఇప్పటి వరకు 10 సీజన్లలో కలిపి రూ. 65.192 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో రైతుల ఖాతాల్లో జమ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.

రైతువేదికలు:- రైతుల కోసం చర్చా వేదిక అవసరమని దేశంలోని ఏ ప్రభుత్వమూ ఆలోచించలేదు. రైతుల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 5 వేల ఎకరాలకు ఒకటి చొప్పున మొత్తం 2,601 రైతువేదికలను నిర్మించింది. ఈ రైతు వేదికలు వ్యవసాయానికి మార్గనిర్దేశం చేస్తున్నాయి.

Next Story