రాజకీయ లబ్ధికోసం టీఆర్ఎస్ పీవీ కుటుంబాన్ని వాడుకుంటుంది
Ex MP Ponnam Prabhakar Fires On TRS. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణిని టీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలపడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 22 Feb 2021 8:23 AM GMT
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణిని టీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలపడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. పీవీ కుమార్తెకు రాజ్యసభ లేదా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి వారి పట్ల నిజమైన ప్రేమను టిఆర్ఎస్ చాటుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పీవీ కుమార్తెను హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలలో రాజకీయ లబ్ది పొందాలని ఆలోచన చేస్తుందని ఆరోపించారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పీవీ నరసింహా రావును గౌరవిస్తూ బరిలో నిలిచిన అభ్యర్థులందరూ స్వచ్ఛందంగా నామినేషన్ వెనక్కి తీసుకోవాలని అంటున్నారని.. నిజంగా పీవీ మీద ప్రేమ ఉంటే.. తెలంగాణ బిడ్డగా గౌరవించాలనే ఆలోచన ఉంటే.. వారి కూతురికి రాజ్యసభ ఇవ్వండి లేకపోతే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని పొన్నం డిమాండ్ చేశారు. అభ్యర్థులు ఎవరూ లేక రాజకీయ లబ్ధికోసం పీవీ కుటుంబాన్ని వాడుకుని.. నీచ స్థితికి దిగజారవద్దని ఫైర్ అయ్యారు. గెలవలేని, బలం లేని ఎమ్మెల్సీ స్థానంలో పీవీ కుమార్తెకు అవకాశం ఇచ్చి అవమానపరిచే ప్రయత్నం చేయవద్దని వ్యాఖ్యానించారు.