లిక్కర్ స్కామ్‌ గురించి చర్చించడానికే కేసీఆర్‌తో కేజ్రీవాల్ భేటీ : పొన్నాల

Ex Minister Ponnala Laxmaiah Fire On CM KCR. ప్రజల దృష్టి మరల్చ‌డానికి ఇక్కడ కేసీఆర్, అక్కడ మోదీ జిమ్మిక్కులు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్

By Medi Samrat  Published on  27 May 2023 7:33 AM GMT
లిక్కర్ స్కామ్‌ గురించి చర్చించడానికే కేసీఆర్‌తో కేజ్రీవాల్ భేటీ : పొన్నాల

ప్రజల దృష్టి మరల్చ‌డానికి ఇక్కడ కేసీఆర్, అక్కడ మోదీ జిమ్మిక్కులు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శ‌నివారం ఆయ‌న గాంధీ భ‌వ‌న్‌లో మాట్లాడుతూ.. పార్లమెంట్ వ్యవస్థపై బీజేపీ చిత్తశుద్ధి ఏంటో చర్చకు సిద్దమా అని స‌వాల్ విసిరారు. ప్రజాస్వామ్యంపై మోదీకి విశ్వాసం ఉందా అని అడిగారు. ప్రజలు తిరగబడితే నల్ల చట్టాల విషయంలో బీజేపీ తోక ఎలా ముడిచిందో.. భవిష్యత్ లో బీజేపీకి అదే జ‌రుగుతుంద‌న్నారు. బీజేపీ పాలన మాకొద్దు అని జనం చేతులు ఎత్తి దండం పెడుతున్నారని అన్నారు.

దేశంలో ఆర్డినెన్స్ ల ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీజేపీ ప్రభుత్వమేన‌న్నారు. పార్లమెంట్ భవనం ఏదైనా.. బీజేపీ అప్రజాస్వామికపాలనలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. నల్లధనం తెస్తామన్నారు.. ఏమైందని నిల‌దీశారు. పార్లమెంట్ లో నల్లధనం గురించి చర్చించే దమ్ము బీజేపీ కి ఉందా అని ప్ర‌శ్నించారు. ఉద్యోగాల గురించి డిబేట్ చేసే ధైర్యం మోదీకి ఉందా అని అడిగారు. అదానీ కంపెనీల లో పెట్టుబడుల గురించి మాట్లాడమంటే మోదీ ఎందుకు భ‌యపడుతున్నారని ప్ర‌శ్నించారు. మోదీ లాంటి పార్లమెంట్ పై నమ్మకం లేని వ్యక్తికి పార్లమెంట్ కొత్త భవనం అయితే ఏంటి, పాత భవనం అయితే ఏంటి అని విమ‌ర్శ‌లు గుప్పించారు. 69 ఏళ్ళలో 71 వేల అప్పు చేస్తే.. కేవలం 9 ఏళ్ళలో 5 లక్షల అప్పు కేసీఆర్ చేసారు. కేజ్రీవాల్ పక్కనే ఉండే అన్నా హాజరే ఎటు పోయారని ప్ర‌శ్నించారు. లిక్కర్ స్కాం కేసు గురించి చర్చించడానికే కేసీఆర్ తో కేజ్రీవాల్ భేటీ అవుతున్నార‌ని మాజీమంత్రి పొన్నాల వ్యాఖ్యానించారు.


Next Story