సొంత విమానం కొనడం కేసీఆర్ దోపిడీకి నిదర్శనం

Ex Minister Ponnala Lakshmaiah Fire On CM KCR. చేసిన పాపాలు పరిహారం కోసమే కేసీఆర్ యాదాద్రికి కానుకలు స‌మ‌ర్పిస్తున్నారని

By Medi Samrat  Published on  30 Sep 2022 11:09 AM GMT
సొంత విమానం కొనడం కేసీఆర్ దోపిడీకి నిదర్శనం

చేసిన పాపాలు పరిహారం కోసమే కేసీఆర్ యాదాద్రికి కానుకలు స‌మ‌ర్పిస్తున్నారని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమ‌ర్శించారు. శుక్ర‌వారం గాంధీ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న.. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్లు ఉంది కేసీఆర్ తీరు అని ఎద్దేవా చేశారు. దేశంలో కేసీఆర్ అంత దోపిడీ ఏ సీఎం చేయలేదని ఆరోపించారు. చేసిన దోపిడీ తో జాతీయ పార్టీ పెడతానని దేవుడికి మొక్కుతే వరం ఇస్తాడా.. అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ పాలనలో దేవాదుల ప్రాజెక్టులో మూడో మోటారు ఎందుకు నడప లేదని నిల‌దీశారు.

వరంగల్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గురించి మాట్లాడిన కేసీఆర్.. ఎందుకు ఇప్పటి వరకు ఒక్క పైసా ఖర్చు చేయలేదని అడిగారు. టెక్ట్స్ టైల్స్ పార్క్ హామీ ఎటు బోయింది.. వరంగల్ లో స్లమ్స్ ల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం హామీ ఏమైంది.. కొద్దో గొప్పో కట్టిన ఇళ్లను ఎందుకు లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు.. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు పుర్తి కాలేదు.. వరంగల్ ఎయిర్ పోర్ట్ కు ఒక్క పైసా నైనా నిధులు మంజూరు చేశాడా.. కోచ్ ఫ్యాక్టరీ నీ ఎందుకు సాధించలేక పోయారు.. భద్రకాళి దేవాలయం దగ్గర ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

కేసీఆర్ వరంగల్ టూర్ లో జిల్లా ప్రజలకు వీటిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎనిమిదేళ్లలో వరంగల్ కు చేసింది ఏమీ లేదని.. మేము లేవనెత్తిన అంశాల పై వరంగల్ టూర్ లో కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. జాతీయ పార్టీ పేరుతో సొంత విమానం కొనడం కేసీఆర్ దోపిడీకి నిదర్శనమ‌ని విమ‌ర్శించారు.


Next Story