హైదరాబాద్: దసరా సెలవుల్లో స్కూళ్లు, కాలేజీల్లో ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సెలవుల్లో రివిజన్ కోసం విద్యార్థులకు కొంత హోమ్ వర్క్ ఇవ్వాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు, జూనియర్ కాలేజీలకు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉండనున్నాయి.
అటు సాంకేతిక విద్యా శాఖా విడుదల చేసిన నూతన ఉత్తర్వుల ప్రకారం.. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 05 వరకు పాలిటెక్నిక్, ఫార్మా కళాశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. దీంతో వీరికి మొత్తం దసరా సెలవులు 11 రోజులు ఉండనున్నాయి. తెలంగాణలో దసరా పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. దేవీ నవరాత్రుల కోసం హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మవారి విగ్రహాలను సైతం ఏర్పాటు చేస్తారు. 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. బతుకమ్మ ఆట, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక, ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 2వ తేదీన వచ్చింది.