త్వరలో 14 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..డీజీపీ కీలక ప్రకటన
తెలంగాణలో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు డీజీపీ శివధర్రెడ్డి శుభవార్త చెప్పారు.
By - Knakam Karthik |
త్వరలో 14 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..డీజీపీ కీలక ప్రకటన
తెలంగాణలో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు డీజీపీ శివధర్రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలో 14 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కీలక ప్రకటన చేశారు. ఈ భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్నాయని, నూతన సంవత్సర కానుకగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు మూడు విడతలుగా (2016, 2018, 2022) పోలీసు నియామకాలు జరిగాయి. అయితే 2023 నుంచి రిక్రూట్మెంట్లో జాప్యం జరుగుతుండటంతో ప్రభుత్వంపై నిరుద్యోగులు ఒత్తిడి తెస్తున్నారు. లక్షలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోతుందన్న ఆందోళనలో ఉన్న తరుణంలో డీజీపీ ప్రకటన వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
శాఖలో ఏటా పదవీ విరమణలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటం, కొత్తగా సిబ్బంది తోడవకపోవడంతో ప్రస్తుతం ఉన్న పోలీసులపై పనిభారం రెట్టింపైంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు ఇస్తేనే సిబ్బంది సంఖ్య సమతుల్యంగా ఉంటుందని పోలీసు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బంది కొరతను అధిగమించి, క్షేత్రస్థాయిలో పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.