హైదరాబాద్: ఈనెల 18వ తేదీన వివిధ పార్టీలు తలపెట్టిన బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. బంద్ పేరుతో అవాంచనీయ సంఘటనలకు గానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు గానీ పాల్పడినట్లయితే చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని డిజిపి అన్నారు. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తాయని, బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని డిజిపి సూచించారు. సాధారణ ప్రజలకు సమస్యలు ఎదురవకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
కాగా 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు అధికార కాంగ్రెస్ పార్టీ సహా, బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు తెలిపాయి. అటు సుప్రీంకోర్టులో తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో..పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.