అప్పుల రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల పాలనను పూర్తి చేసుకోవడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్వీట్‌ చేశారు.

By అంజి  Published on  7 Jan 2024 10:05 AM GMT
Deputy CM Bhatti Vikramarka, Telangana, Congress Govt

అప్పుల రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల పాలనను పూర్తి చేసుకోవడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్వీట్‌ చేశారు. తెలంగాణ ప్రజల కలలను నిజం చేయడమే ఇందిరమ్మ ప్రజా పాలన లక్ష్యం అని పేర్కొన్నారు. అధికార గర్వంతో విర్ర వీగకుండా సేవకుడిలా పని చేస్తానని తెలిపారు. అప్పుల రాష్ట్రాన్ని గట్టెక్కిస్తామని, విద్యుత్‌ ఉత్పత్తి పెంచి వెలుగులు పంచుతామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పని చేస్తామన్నారు. 10 ఏండ్లు పరిపాలన చేసిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి అధోగతి పాలు చేసిందని భట్టి ఆరోపించారు.

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి గట్టెక్కించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడ్తామని అన్నారు. గత ప్రభుత్వ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, అప్పుల ఊబిలోకి నెట్టినప్పటికీ ఉద్యోగులకు రెండవ తారీఖున జీతాలు ఇచ్చిన ప్రభుత్వం తమది, రాష్ట్ర అప్పుల పాలైనప్పటికీ తెలంగాణ ప్రజల కలలు నిజం చేయడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చిన వాటిని అధిగమించి సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సహజ వనరులు, ఇతను వనరులను రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లి సంపద సృష్టించి సృష్టించిన సంపదను ప్రజలకు పంచడమే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి నిష్ణాతులతో మాట్లాడడానికి తనకు ఎలాంటి భేషజాలాలు లేవు, రాజ్యాంగం, ఫెడరలిజం స్ఫూర్తితో రాష్ట్రానికి రావలసిన ఆదాయ వనరులను కేంద్రం నుంచి రాబట్టుకోవడానికి ముందుకు వెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. రాష్ట్ర విభజన చట్టాల హామీలు అమలు కోసం కేంద్రానికి విన్న విస్తామని, ఇందులో ఎలాంటి భేషజాలాలకు పోము, ఎన్నికల అప్పుడే రాజకీయాలు తప్పా, ఇప్పుడు పాలన అభివృద్ధి ముఖ్యం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం అందరి సమిష్టి బాధ్యత అని భట్టి చెప్పారు.

ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ మా కోసమే ఏర్పాటు చేశారని ప్రతి పౌరుడు అనుకునే, దిశగా తమ పరిపాలన సాగుతుందన్నారు. మొదటిసారి ఓటు వచ్చి అభివృద్ధికే పట్టం కట్టిన యువతీ యువకులు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలుపుతున్నానని అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు పరిశ్రమలు పెట్టుకునే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు పెట్టుకున్న కలలను నిజం చేయడంతో పాటు వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కంకణ బద్ధులమై పనిచేస్తామని హామీ ఇచ్చారు.

Next Story