ఖర్గే సభను విజయవంతం చేయండి..పార్టీ నేతలకు డిప్యూటీ సీఎం పిలుపు
ఈ నెల 4వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు
By Knakam Karthik
ఖర్గే సభను విజయవంతం చేయండి..పార్టీ నేతలకు డిప్యూటీ సీఎం పిలుపు
ఈ నెల 4వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. గ్రామ శాఖ అధ్యక్షులు మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు. ఖర్గే పర్యటన నేపథ్యంలో బుధవారం డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి లతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించి మీడియాతో మాట్లాడారు.
గ్రామ శాఖ అధ్యక్షులతో అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేరుగా సమావేశం కావడం దేశంలోనే ఇది మొదటిసారి అని డిప్యూటీ సీఎం వివరించారు. తెలంగాణ రాష్ట్రం అనంతరం దేశవ్యాప్తంగా ఈ తరహా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వివరించారు. నాలుగో తేదీ సాయంత్రం మూడు గంటలకల్లా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒకరికి మరొకరు సమాచారం చేర వేసుకొని సమన్వయంతో సభకు విచ్చేసి విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. గ్రామ శాఖ అధ్యక్షులతో ఏఐసిసి అధ్యక్షుడు మాట్లాడే కార్యక్రమానికి మొదటి అవకాశం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినందుకు అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశం ద్వారా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో నేరుగా కలిసి మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తరలిరావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు.