ఎలివేటెడ్‌కు లైన్ క్లియర్..HMDAకు డిఫెన్స్ భూముల బదిలీకి రక్షణ మంత్రిత్వశాఖ ఆమోదం

రక్షణ శాఖ భూముల బదలాయింపు పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కీలక అడుగు పడింది.

By Knakam Karthik
Published on : 9 July 2025 9:45 AM IST

Hyderabad News, Defence Ministry, Land Transfer, HMDA, Traffic Congestion

ఎలివేటెడ్‌కు లైన్ క్లియర్..HMDAకు డిఫెన్స్ భూముల బదిలీకి రక్షణ మంత్రిత్వశాఖ ఆమోదం

సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి 6.85 లక్షల చదరపు మీటర్ల భూమిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA)కి బదిలీ చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) ఆమోదం తెలిపింది. రక్షణ శాఖ భూముల బదలాయింపు పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కీలక అడుగు పడింది. ఈ భూమిని రాష్ట్ర రహదారి-1 (SH-1), జాతీయ రహదారి-44 (NH-44) లలో ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించడానికి ఉపయోగిస్తారు. ఈ కారిడార్ నిర్మాణ పనులకు సంబంధించి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది.

ఈ మేరకు మంగళవారం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ల్యాండ్స్ డిప్యూటీ డైరెక్టర్ విక్రమ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలతో పాటు సికింద్రాబాద్, కంటోన్మెంట్, హకీంపేట ప్రాంతాల్లో మొత్తం 168 ఎకరాల రక్షణ శాఖ భూములను బదలాయింపు చేస్తున్నా మని అందులో భాగంగా సరిసమానమైన భూమితో పాటు పరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని పేర్కొంటూ రక్షణ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కారిడార్లను ప్యారడైజ్ జంక్షన్ నుండి SH-1లోని మిలిటరీ డైరీ ఫామ్ రోడ్ వరకు, NH-44లోని శామీర్‌పేట్ వరకు ప్రతిపాదించారు. రక్షణ మంత్రిత్వ శాఖ మార్చి 2024 నుండి తన మునుపటి ఉత్తర్వును సవరించడానికి రాష్ట్రపతి ఆమోదాన్ని తెలియజేస్తూ ఒక సవరణను జారీ చేసింది, తద్వారా బదిలీకి మార్గం సుగమం అయింది. ఈ ఒప్పందం ప్రకారం, SH-1 కోసం 4,59,222.70 చదరపు మీటర్లు మరియు NH-44 కోసం 2,26,039.91 చదరపు మీటర్లు కేటాయించబడ్డాయి. సమాన విలువ కలిగిన భూమి (EVL) నగదు పరిహారం కోసం బదులుగా ఈ బదిలీ జరుగుతుంది.

కంటోన్మెంట్ బోర్డు, డిఆర్‌డిఓ, ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, డిఈఓలకు చెందిన డిఫెన్స్ భూములు దాదాపుగా 168 ఎకరాల భూములను ప్రభుత్వానికి బదలాయింపు చేసినందుకు జవహర్‌నగర్‌లోని 330ఎకరాల హెచ్‌ఎండిఏ భూమిని రాష్ట్ర ప్రభుత్వం పరిహారం కింద రక్షణశాఖకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వివిధ సర్వే నెంబర్లలో ఉన్న 113 ఎకరాల రక్షణ శాఖ భూమికి సరి సమానమైన పరిహారం కింద రూ.803 కోట్ల విలువైన భూ బదలాయింపుతో పాటు రూ.151కోట్ల నగదు చెల్లింపునకు హెచ్‌ఎండిఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి శామీర్‌పేట ఓఆర్‌ఆర్ జంక్షన్ వరకు (సుమారు 18.124 కి.మీల) మేర నిర్మించనున్న కారి డార్‌కు లైన్ క్లియర్ అయ్యింది. రాష్ట్ర హైవే 44లో, జాతీయ రహదారి 44లో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ కోసం 55 ఎకరాల డిఫెన్స్ భూమిని కేటాయించారు. ఇందుకోసం ఆయా భూముల కోసం హెచ్‌ఎండిఏ పరిహారంగా రూ.748కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

Next Story