తెలంగాణ కేబినెట్ విస్తరణలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. ఈ మేరకు మంగళవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్కు జానారెడ్డి లేఖ పంపించారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు కల్పించాలని ఆ లేఖలో కోరారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ప్రయోజనమే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని జానారెడ్డి పేర్కొన్నారు.
కాగా తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఆశావహుల లిస్టును సైతం హైకమాండ్కు పంపించినట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తమ ప్రాంతం వారికి కూడా ప్రాతినిధ్యం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానానికి జానారెడ్డి లేఖ రాయడం ఆసక్తిని కలిగిస్తోంది. మరో వైపు తమ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని మాదిగ, లంబాడి, బీసీ సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఇటీవల అధిష్టానానికి లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్, పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్లకు తమ వినతులను మెయిల్, ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఇక ఏప్రిల్ 3న మంత్రి వర్గ విస్తరణ ఉండే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రేవంత్రెడ్డి ప్రభుత్వంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. ఇందులో నాలుగింటిని భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.