కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకెళ్లేది జగదీశ్‌రెడ్డే: మంత్రి కోమటిరెడ్డి

మాజీమంత్రి జగదీశ్‌రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  23 Jan 2024 5:29 AM GMT
congress, minister komatireddy,   jagadeesh reddy, brs,

కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకెళ్లేది జగదీశ్‌రెడ్డే: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనీ.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ కాంగ్రెస్‌ మంత్రులు మండిపడుతున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు కూడా వాటి కౌంటర్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా మాజీమంత్రి జగదీశ్‌రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల కాంగ్రెస్ సర్కార్‌పై మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శలు చేశారు.. వాటిపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చార. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్‌ కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న అక్కసుతోనే జగదీశ్‌రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. విద్యుత్‌ కేంద్రాల్లో అవకతవకలపై విజిలెన్స్, సిట్టింగ్ జడ్జి విచారణ తర్వాత కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు వెళ్లేది జగదీశ్‌రెడ్డే అని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. అయితే.. తమ ప్రభుత్వం త్వరలోనే పడిపోనుందంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారనీ.. కానీ పూర్తి కాలం తాము అధికారంలో కొనసాగుతామని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌లో 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరని.. కాంగ్రెస్‌లోకి 30 మంది ఎమ్మెల్యేలు రానున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.

సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తిప్పర్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే జగదీశ్‌రెడ్డిపై ఈ కామెంట్స్ చేశారు. అయితే.. తెలంగాణ కోసం మంత్రి పదవిని తాను తృణప్రాయంగా వదిలిపెట్టానని.. ఆ విషయం జగదీశ్‌రెడ్డికి గుర్తులేదా అన్నారు. అలాంటి తన గురించి జగదీశ్‌రెడ్డి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అయితే.. జగదీశ్‌రెడ్డికి ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయనీ..అవి ఎలా వచ్చాయో చెప్పలగలరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందన్నారు. కరెంటు బిల్లులు కట్టడం మానుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టడం మానుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Next Story