భ‌గ్గుమ‌న్న కాంగ్రెస్ శ్రేణులు.. రాజగోపాల్‌రెడ్డికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు

Congress members burn effigy of Rajagopal Reddy. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో పార్టీకి వెన్నుపోటు

By Medi Samrat  Published on  3 Aug 2022 10:21 AM GMT
భ‌గ్గుమ‌న్న కాంగ్రెస్ శ్రేణులు.. రాజగోపాల్‌రెడ్డికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో పార్టీకి వెన్నుపోటు పొడిచారంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు చోట్ల‌ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు బుధవారం ఆయన దిష్టిబొమ్మల‌ను దహనం చేశారు. రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు సంస్థాన్ నారాయణపూర్, గట్టుప్పల్, మునుగోడు ప్రధాన కేంద్రాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజగోపాల్ రెడ్డి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మరో రాజకీయ పార్టీలోకి మారాలని యోచిస్తున్నారని ఆరోపించారు.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థిని ఓడించి పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్ సభ్యులు నెల రోజులకు పైగా శ్రమించారు. తన గెలుపునకు కృషి చేసిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అవమానించారని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు అవసరమైతే.. రాజగోపాల్ రెడ్డి కేవలం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉండవచ్చు. కానీ.. కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం వెనుక వ్యక్తిగత ప్రయోజనాలే ఉన్నాయని ఆరోపించారు.

రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోవడం కాంగ్రెస్ పార్టీకి నష్టమేన‌ని టీపీసీసీ అధికార ప్ర‌తినిధి అద్దంకి ద‌యాక‌ర్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి సహజ గుణం కోల్పోయి మాట్లాడుతున్నారని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్, బిజెపి అకు దిక్కయ్యిందని అన్నారు. టిఆర్ఎస్ పార్టీకి నాయకులు లేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, జెడ్పిటిసిలను తీసుకున్నారని విమ‌ర్శించారు. టిఆర్ఎస్ కి బిజెపికి రేవంత్ రెడ్డి నే టార్గెట్ అని అన్నారు. ఈటెల రాజేందర్ , రాజగోపాల్ రెడ్డి వ్యాపారాలను కాపాడుకోవడానికి బీజేపీలోకి వెళ్లారని విమ‌ర్శించారు.

దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా బిజెపి చేస్తుందని టిపిసిసి అధికార ప్రతినిథి బెల్లయ్య నాయక్ ఆరోపించారు. బిజెపికి తామంత‌ట‌ తాము లేవడం చేతగాక ఇతర పార్టీల నేతలను తీసుకుంటుందని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎం తక్కువ చేసిందని రాజీనామా చేసావ్ రాజగోపాల్ అని ప్ర‌శ్నించారు. మునుగోడు ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ఎందుకు ప్రగతి భవన్ ముందు ధర్నా చేయలేదని నిల‌దీశారు. నీ మీద విశ్వాసం లేకనే అధిష్టానం పిసిసి పదవి ఇవ్వలేదని అన్నారు.


Next Story