రాజీవ్‌ యువ వికాసం పథకం.. సీఎం రేవంత్‌ కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

By అంజి
Published on : 25 Jun 2025 6:29 AM IST

CM Revanth, Rajiv Yuva Vikasam Scheme , Telangana

రాజీవ్‌ యువ వికాసం పథకం.. సీఎం రేవంత్‌ కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయం దండుగ కాదు. పండుగ. రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా పని చేస్తామని పునరుద్ఘాటించారు. రైతు భరోసా కింద ఈ నెల 16 వ తేదీన రైతు ఖాతాల్లోకి డబ్బు వేయడం ప్రారంభించినప్పటి నుంచి చెప్పిన మాట ప్రకారం 9 రోజుల్లోగా 9 వేల కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం పూర్తయిందన్నారు. ఈ ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 16 వందల రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లక్షలాది రైతులు వీక్షించారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలతో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి.. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గతంలో చెప్పినట్టుగానే 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఎకరాకు 12 వేల చొప్పున 1 కోటి 40 లక్షల ఎకరాలకు 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంగా రైతులందరికీ అభినందనలు తెలిపారు.

''రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వానికి రైతులు మొదటి ప్రాధాన్యత. ఆ తర్వాత క్రమంలో మహిళలు, తెలంగాణ ఉద్యమకారులైన యువతకు ప్రాధాన్యతనిస్తున్నాం. అందుకే అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే రైతు భరోసా కింద 7,625 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశాం. వచ్చే పదేండ్లలో వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో 25,35,964 మంది రైతులకు సంబంధించి 20,617 కోట్ల రూపాయలు చెల్లించి రుణ విముక్తులను చేశాం'' అని సీఎం రేవంత్‌ తెలిపారు.

''ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు చెల్లించడమే కాకుండా సన్న వడ్లు పండించిన వారికి బోనస్ ఇస్తున్నాం. 2.80 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధిక దిగుబడిని ఇచ్చి గర్వంగా చెప్పుకునే రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టారు. రైతాంగానికి అండగా నిలబడాలన్న లక్ష్యంతోనే రుణ మాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్, ఉచిత కరెంట్, స్ప్రింక్లర్స్, డ్రిప్, సోలార్ గిరి వికాసంలో పంపుసెట్లు, సివిల్ సప్లయ్ విభాగం ద్వారా ధాన్యం కొనుగోలు.. ఇలా కేవలం 18 నెలల కాలంలో వ్యవసాయ రంగంపై 1 లక్ష 04 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ప్రజా ప్రభుత్వం ఇది'' అని సీఎం పేర్కొన్నారు.

''ప్రజా పాలనలో రైతులు, మహిళలు, యువకుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సోలార్ పవర్ ప్లాంట్లు, అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ, స్కూలు పిల్లల యూనిఫామ్ కుట్టించే బాధ్యత అప్పగించడం, స్వయం సహాయ సంఘాలకు సహాయం... ఇలా కోటి మంది కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. అధికారం చేపట్టిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఇటీవల ప్రకటించిన రాజీవ్ యువ వికాసం ద్వారా యువకులను ఆదుకునే ప్రణాళికలతో ముందుకు వస్తాం. తదుపరి కార్యక్రమంగా రాజీవ్ యువ వికాసం చేపడుతాం. ప్రజా పాలనలో రైతులు, మహిళలు, యువకులు భద్రంగా ఉండాలన్నదే మా ఆకాంక్ష'' అని సీఎం రేవంత్‌ తెలిపారు.

''గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం అన్ని రకాలుగా పోరాడుతాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్రానికి ఫిర్యాదు చేశాం. ఒకవేళ కేంద్రం ప్రాజెక్టుకు అనుమతిస్తే న్యాయస్థానాల్లో పోరాడుతాం. బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం ముందు రాష్ట్రం తెలిపిన అభ్యంతరాల విషయంలో అసెంబ్లీలో చర్చకు సిద్ధం'' అని ముఖ్యమంత్రి వివరించారు.

Next Story