'మొబైల్ అంగన్వాడీలు'.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణ అంగన్వాడీలు దేశానికి రోల్మోడల్గా నిలిచేలా తీర్చిదిద్దాలని.. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రెడ్డి అధికారులను ఆదేశించారు.
By అంజి
'మొబైల్ అంగన్వాడీలు'.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణ అంగన్వాడీలు దేశానికి రోల్మోడల్గా నిలిచేలా తీర్చిదిద్దాలని.. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రెడ్డి అధికారులను ఆదేశించారు. అంగన్వాడీలకు వచ్చే పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు అయిదేళ్ల వరకు వారికి పూర్వ ప్రాథమిక విద్యను అందించి నేరుగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేలా చూడాలని సూచించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సాధికారిత శాఖలపై మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్ అడ్లూరితో పాటు ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
“అంగన్వాడీలకు నూతన భవనాలు నిర్మించే విషయంలో అధునాతన సాంకేతికతను వినియోగించుకోవాలి. పిల్లల అవసరాలకు తగినట్లు కంటైనర్లతో డిజైన్ చేయించే అంశాన్ని అధ్యయనం చేయాలి. సోలార్ ప్లేట్లు, బ్యాటరీ బ్యాకప్తో కంటైనర్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తే తక్కువ వ్యయం, ఎక్కువ సౌకర్యం ఉంటుంది. ఈ అంశంపై ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న కంటైనర్ కేంద్రాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రతి పిల్లవానికి పౌష్టికాహారం అందించాలి. ఇందుకు ఎన్జీవోల సేవలు వినియోగించుకోవాలి.
బాలామృతం ప్లస్ను పెద్ద మొత్తంలో ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి. కర్ణాటకలో జొన్న రొట్టెలను వినియోగిస్తున్నందున పౌష్టికాహార నిపుణులతో చర్చించి వాటిని మహిళా సంఘాలతో పిల్లలకు అందించే అంశంపైనా దృష్టి సారించాలి. అంగన్వాడీల్లో పౌష్టికాహారం అందజేత, అంగన్వాడీల పర్యవేక్షణ, నిర్వహణపై వంద రోజుల కార్యాచరణ రూపొందించి అమలు చేయాలి.
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంక్షేమం విషయంలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు కలిసే పని చేయాలి. అనాథ పిల్లలకు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తున్న తరహాలోనే, ఏటీసీల్లోనూ వాళ్లకు ప్రవేశాలు కల్పించాలి. మన పిల్లలను సింగపూర్లోని నైపుణ్య శిక్షణ కేంద్రాలకు పంపే ఒప్పందం చేసుకున్నాం. అక్కడకు పంపే వారిలో అనాథ పిల్లలకు చోటు కల్పించాలి.
ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని బస్తీలు, వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని పిల్లల కోసం మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. నిర్దేశిత సమయంలో అక్కడి పిల్లలకు ఆయా వాహనాల ద్వారా పౌష్టికాహారం అందేలా చూడాలి. విశ్రాంత ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు ఆయా పిల్లలకు బోధన చేసేందుకు ఆసక్తి చూపితే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. తెలంగాణ ఫుడ్స్, విజయా డెయిరీ ఉత్పత్తులను అంగన్వాడీలకు అందేలా చూడాలి” అని చెప్పారు.
నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రులను, పట్టించుకోలేని స్థితిలో ఉన్న వృద్ధులకు ప్రభుత్వం అండగా నిలవాల్సి ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల తల్లిదండ్రులైతే వారి వేతనాల నుంచి నేరుగా వారి తల్లిదండ్రులకు ఖాతాలకు 10-15 శాతం జమ అయ్యే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ట్రాన్స్జెండర్లకు ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో అవకాశం కల్పించామని, వారి సేవలను రవాణా, దేవాదాయ శాఖ, వైద్యారోగ్య శాఖలతో పాటు ఐటీ, ఇతర కంపెనీల సేవల్లో వినియోగించుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ రైసింగ్ 2047 డాక్యుమెంట్లో చిన్నారులు, మహిళలు, దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా దివ్యాంగుల మధ్య వివాహాలు, వివిథ పథకాల్లో దివ్యాంగులకు ప్రోత్సాహాకాలు కల్పించే విషయంపై అధ్యయం చేసి వచ్చే మంత్రిమండలి సమావేశం నాటికి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు.