హైదరాబాద్ మెట్రో ఫేజ్-II కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కి విజ్ఞప్తి చేశారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్-II అవసరం ఎంతో ఉందని వివరంగా తెలియజేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్ తో వారి నివాసంలో సమావేశమయ్యారు. రూ. 24,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మెట్రో ఫేజ్-II సాకారమైతే నగరంలో రాకపోకలు వేగంగా సాగడంతో పాటు రహదారులపై రద్దీ తగ్గుతుందని.. సుస్థిరాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు.
పట్టణ వ్యవహారాల శాఖ సూచన మేరకు అవసరమైన సవరణలు చేసి ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-II ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్, ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ మెట్రో ఎండీ ఎండీ ఎన్వీఎస్. రెడ్డి, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.