సంక్షేమ పథకాల్లో ముస్లింలకు తగిన వాటా: సీఎం రేవంత్
తెలంగాణలోని మైనారిటీ వర్గాల అభివృద్ధి, విద్య, ఉపాధి రంగాల్లో అవసరమైన మేరకు ఆదుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
By అంజి
సంక్షేమ పథకాల్లో ముస్లింలకు తగిన వాటా: సీఎం రేవంత్
తెలంగాణలోని మైనారిటీ వర్గాల అభివృద్ధి, విద్య, ఉపాధి రంగాల్లో అవసరమైన మేరకు ఆదుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ముస్లింలలో ఎంతో మంది నిరుపేదలు ఉన్నారని, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల్లో వారి జనాభా మేరకు అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. హజ్ యాత్రికుల సౌకర్యార్థం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని మామిడిపల్లిలో వసతి భవనం (రూబత్) నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్కు వెళ్లి ప్రార్థనలు చేయాలని అనుకుంటారని, ఈసారి ప్రభుత్వానికి 6 వేల దరఖాస్తులు అందితే వాటన్నింటినీ ఆమోదించినట్టు చెప్పారు.
హజ్ యాత్రికులకు వీడ్కోలు పలుకుతూ విమానాశ్రయం బయలుదేరిన బస్సులకు నాంపల్లి హజ్ హౌజ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, యాత్రికులకు శుభాభినందనలు తెలియజేశారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి హజ్కు వెళ్లే హజీల కోసం అవసరమైన ఏర్పాట్లు చేశారని, ప్రభుత్వం అందుకు అన్ని విధాలుగా సహకరించిందని చెప్పారు. “హజ్కు వెళ్లడం మీ హక్కు. ఈ విషయంలో ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. మీకు అవసరమైన ఏర్పాట్లు చేయడం మా బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడంలో వెనుకడుగు వేయమని” అన్నారు.
ఈ వేదిక నుంచి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ, ఇది ఓల్డ్ సిటీ కాదు. ఇదే ఒరిజినల్ సిటీ అని ఇదివరకు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఒరిజినల్ సిటీ అభివృద్ధి కోసం ఎంపీ అడిగిన దానికన్నా ఎక్కువగానే దాదాపు 2 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మెట్రో విస్తరణ, రోడ్ల నిర్మాణం, మిరాలం ట్యాంక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం వంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న విషయాన్ని గుర్తుచేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి సంక్షేమ పథకాల్లో తగిన వాటా మేరకు ముస్లింల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన ముస్లిం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. “హజ్కు వెళుతున్న యాత్రికులు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ప్రజల శాంతియుత జీవనం కోసం అల్లాను ప్రార్థించండి. హజ్ యాత్రికుల కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండలు అందిస్తుంది. భవిష్యత్తులోనూ మీ నుంచి వచ్చే అభ్యర్థనల విషయంలోనూ ప్రభుత్వం చేయగలిగినంత సహాయం చేస్తుంది. అది మా బాధ్యత” అని ముఖ్యమంత్రి వివరించారు.