హైదరాబాద్: రాష్ట్రంలో వీఎఫ్ఎక్స్, గేమింగ్, ఆడియో విజువల్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ సింగ్ చౌదరి సూచించారు. జయంత్ చౌదరి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఐటీఐ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను త్వరలో ఏర్పాటు చేసి, దానిని ఐటీఐలను అనుసంధానిస్తామని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి తెలియజేశారు.
తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రి అభినందించారు. జాతీయ నైపుణ్య శిక్షణ కింద వైఐఎస్యూకి మద్దతు ఇవ్వాలని సీఎం కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. ఐటీఐలన్నింటికీ ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. ఐటీఐల్లో సోలార్ విద్యుత్ వ్యవస్థను వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లు ఐటీఐల్లో సిలబస్ను అప్గ్రేడ్ చేయాలని, అందుకోసం ప్రత్యేక కమిటీ నియమించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో పాటు సంబంధిత శాఖల రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.