యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలో సీఎం రేవంత్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగారు గోపురాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ఉదయం 11.54కి మూలా నక్షత్రం, వృషభ లగ్నం, పుష్కర అంశంలో లక్ష్మీనరసింహ స్వామివారికి గోపురాన్ని అంకితం చేశారు. రూ.80 కోట్లతో 68 కిలోల బంగారాన్ని ఉపయోగించి దీన్ని రూపొందించారు. దేశంలోనే ఎత్తైన తొలి స్వర్ణతాపడ గోపురంగా ఇది చరిత్ర సృష్టించింది.
దీనిపై నృసింహావతారాలు, కేశవ నారాయణ, లక్ష్మీ, గరుడమూర్తుల ఆకారాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి. ఆలయ రాజగోపురం 50.5 ఫీట్ల ఎత్తులో సుమారు 10,759 ఎస్ఎఫ్టీలుగా ఉంది. బంగారు తాపడం కోసం ఒక్కో ఎస్ఎఫ్టీకి 6 గ్రాముల చొప్పున మొత్తం 68 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని 2021లో అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే.