వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కు సంబంధించి ఎగవేతలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. జీఎస్టీ పరిధిలోని అన్ని సంస్థలు పన్ను నిబంధనలు పాటించేలా చూసుకోవాలన్నారు. ఆయా సంస్థలు సక్రమంగా పన్ను చెల్లించేలా చూడాలని వాణిజ్య శాఖ అధికారులను ఆదేశించారు. అదే సమయంలో చెల్లింపుదారులకు సంబంధించి అనుమానాలు, సందేహాల నివృత్తికి ప్రత్యేక కాల్సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖపై ముఖ్యమంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఈ సెంటర్ నిర్వహణలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను వినియోగించుకోవాలని సూచించారు. జీఎస్టీ, ఇతర పన్నుల విషయంలో పొరుగు రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి మేలైన విధానాలను స్వీకరించాలన్నారు. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించేలా కార్యాలయాల్లో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.