ఆ కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం: సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ వరదలతో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయించారు.
By అంజి
ఆ కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం: సీఎం రేవంత్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ వరదలతో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు వరదలలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పశువులు మరణించినా పరిహారం ఇస్తామన్నారు. మరిన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విపత్తుపై సమగ్ర నివేదికను తయారు చేసి కేంద్రానికి ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు.
వరదల కారణంగా ఏర్పడిన నష్టంపై సమగ్ర నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలని కూడా రేవంత్ ఆదేశించారు. ఈ నిర్ణయాలతో వరద బాధిత కుటుంబాలకు కొంత భరోసా కలిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గతేడాది భారీ వర్షాలకు జరిగిన నష్టానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు రాకపోవడంపై సీఎం.. అధికారులను ఆరా తీశారు. తక్షణమే కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలన్నారు. భారీ వర్షాల సమయంలో చెరువులకు నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.
అటు హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, నాలాల, ఇతర నీటి వనరులకు సంబంధించి లైడార్ సర్వేను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. సమగ్రమైన వివరాలున్నప్పుడు మాత్రమే ఎటువంటి వివాదాలకు తావుండదని అన్నారు. ఈ విషయంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఇరిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ త్వరగా అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు.