ఢిల్లీకి సీఎం కేసీఆర్‌.. బీజేపీయేతర నేతలను కలిసే ఛాన్స్‌

CM KCR To Delhi .. Focus On Country Politics. తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ బాట పట్టనున్నారు. కేసీఆర్‌ అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాజకీయంగా

By అంజి  Published on  28 Feb 2022 8:03 AM GMT
ఢిల్లీకి సీఎం కేసీఆర్‌.. బీజేపీయేతర నేతలను కలిసే ఛాన్స్‌

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ బాట పట్టనున్నారు. కేసీఆర్‌ అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలతో దేశ రాజకీయాల్లో చర్చ మారిపోయింది. దేశాన్ని బాగు చేసేందుకే తాను జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నానని పదే పదే చెబుతున్నారు. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్‌ ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో కేసీఆర్‌ భేటీ కానున్నారని సమాచారం. దేశంలో యూపీఏ, ఎన్డీయేతర కూటమి అవసరం ఉందని కేసీఆర్‌ పలుమార్లు నొక్కి చెప్పారు.

థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానని, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని సీఎం కేసీఆర్‌ అన్న సంగతి తెలిసిందే. ఇటీవల ముంబై పర్యటనలో సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌లతో సమావేశమయ్యారు. దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు వారితో సుదీర్ఘంగా చర్చించారు. థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు విషయంలో కేంద్రప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న కేసీఆర్‌.. పలువురు బీజేపీయేతర నాయకులతో భేటీ కానున్నారని సమాచారం.

Next Story