బీఆర్ఎస్లో గొడవలు.. 10 మందితో స్క్వాడ్ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ఆత్మీయ సమ్మేళనాలు ఎలా జరుగుతాయో అంచనా వేయడానికి
By అంజి Published on 3 April 2023 7:43 AM IST
బీఆర్ఎస్లో గొడవలు.. 10 మందితో స్క్వాడ్ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ఆత్మీయ సమ్మేళనాలు ఎలా జరుగుతాయో అంచనా వేయడానికి మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ ఎస్. మధుసూధనాచారి నేతృత్వంలో 10 మంది సభ్యులతో కూడిన కమిటీని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఏర్పాటు చేశారు. 'ఆత్మీయ సమ్మేళనాల' సందర్భంగా పలు నియోజకవర్గాల్లో నాయకులు, పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగినట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులకు, కిందిస్థాయి కార్యకర్తలకు మధ్య సత్సంబంధాలు పెంపొందించడంతోపాటు సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో సీఎం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు పార్టీ అంతర్గత వర్గాల సమాచారం.
ఆదివారం జరిగిన టెలికాన్ఫరెన్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కమిటీ ఏర్పాటుపై సీఎం నిర్ణయాన్ని పార్టీ నేతలకు తెలియజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు కమిటీకి సహకరించాలని కేటీఆర్ కోరారు. ఆత్మీయ సమ్మేళనాలపై కమిటీ సంబంధిత నేతల నుంచి అభిప్రాయాన్ని సేకరించి నివేదికను సీఎంకు పంపుతుందని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు ఈ సమావేశాలు జరిగాయా లేదా అనే అంశంపై కమిటీ అధ్యయనం చేసి చంద్రశేఖర్రావుకు నివేదిక అందజేయనుంది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడిగేలా ఎమ్మెల్యేలు అత్యంత చురుకైన కార్యకర్తలతో ఒక టీమ్గా ఏర్పడి బీఆర్ఎస్ను అసెంబ్లీలో హ్యాట్రిక్గా గెలిపించాలని సీఎం ఆదేశించారు. .
గ్రామ సర్పంచ్ల నుంచి ఎమ్మెల్యేల వరకు జిల్లా పార్టీ అధ్యక్షుల వరకు బీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులందరూ స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలతో మమేకమై తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా మార్చి మూడో వారం నుంచి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ‘ఆత్మీయ సమ్మేళనాలు’ నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 27న జరిగే పార్టీ ప్లీనరీకి రెండు రోజుల ముందు ఏప్రిల్ 25లోగా కార్యక్రమాలు పూర్తి చేయాలని తొలుత సీఎం ఆదేశించగా, ఏప్రిల్ 25లోగా ప్రతి మండలం, గ్రామాన్ని కవర్ చేయడం అసాధ్యమని గ్రహించి మే 27 వరకు గడువు పొడిగించారు.