కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండల పరిధిలో జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. హైవేపై వేగంగా వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా అగ్నిప్రమాదానికి గురైంది. సదాశివనగర్ మండలం గుండా వెళ్తున్న సమయంలో కారు ఇంజిన్ నుండి ఒక్కసారిగా పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించారు. వాహనాన్ని పక్కకు ఆపి డ్రైవర్ దిగేలోపే మంటలు కారు మొత్తానికి వ్యాపించాయి. కేవలం కొద్ది నిమిషాల్లోనే కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, అంబులెన్స్కు సమాచారం అందించారు. అనంతరం బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో హైవేపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.