నీళ్ల ట్యాంక్‌లో పడి కోతులు చనిపోవడంపై కేటీఆర్ స్పందన

నాగార్జునసాగర్‌లోని నందికొండ వాటర్‌ ట్యాంక్‌లో కోతులు పడి చనిపోయియాయి.

By Srikanth Gundamalla  Published on  4 April 2024 11:50 AM GMT
brs,   ktr,  monkeys died, nagarjunasagar,

 నీళ్ల ట్యాంక్‌లో పడి కోతులు చనిపోవడంపై కేటీఆర్ స్పందన 

నాగార్జునసాగర్‌లోని నందికొండ వాటర్‌ ట్యాంక్‌లో కోతులు పడి చనిపోయియాయి. దాదాపు 30 కోతులు చనిపోయిన తర్వాత కళేబారాలను గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. చుట్టుపక్కల ప్రజలు తాగే నీటి ట్యాంక్‌లో కోతులు చనిపోవడంతో జనాలంత ఆందోళన చెందారు. ఈ సంఘటన ప్రస్తుతం స్థానిక ప్రజల్లో కలవరం రేపుతోంది. వాటర్‌ ట్యాంక్‌లో కోతులు పడి దాదాపు 10 రోజులు కావొస్తుందని.. అవే నీటిని స్థానికులు తాగారని వార్తలు ప్రచారం అవుతున్నాయి. దాంతో.. తమకు ఏదైనా జరుగుతుందో ఏమో అని జనాలు ఆందోళన చెందుతున్నారు.

అసలే ఎన్నికల సమయం.. ఈ సంఘటనపై రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. దాంతో.. పొలిటికల్‌ దుమారం రేగుతోంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ మున్సిపల్ శాఖలో ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఇది సిగ్గుపడాల్సిన పరిస్థితి అంటూ మండిపడ్డారు. తాగు నీటి ట్యాంకుల శుభ్రత విషయంలో అధికారుల నిర్లక్ష్యం ఇంత ఘోరంగా ఉందా? అని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం కంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలే ముఖ్యం అవుతున్నాయని మండిపడ్డారు. ఈమేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

ఇదే అంశంపై మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి కూడా స్పందించారు. మున్సిపాలిటీ శాఖలో నిర్లక్ష్యం అలుముకుందని విమర్శించారు. ప్రజలకు తాగునీటిని అందించే వాటర్‌ ట్యాంకులను నిత్యం తనిఖీ చేసే సమయం కూడా అధికారులకు లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆ ట్యాంకు నుంచి నీళ్లు తాగిన వారికి వైద్య పరీక్షలు చేయించాలని మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story