Telangana: మూసీ ప్రాజెక్టుపై అసెంబ్లీలో రగడ.. రూ.1.5 లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ వాకౌట్
తెలంగాణ అసెంబ్లీలో బుధవారం మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి.
By - అంజి |
Telangana: మూసీ ప్రాజెక్టుపై అసెంబ్లీలో రగడ.. రూ.1.5 లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ వాకౌట్
తెలంగాణ అసెంబ్లీలో బుధవారం మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఈ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపిందని ఆరోపిస్తూ భారత్ రాష్ట్ర సమితి (BRS) సభ నుండి వాకౌట్ చేసింది. తాము మూసీ నది ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, కానీ ఈ ప్రాజెక్టు ముసుగులో జరుగుతున్న ఆర్థిక అక్రమాలను, ప్రజల ఇళ్లను కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.టి. రామారావు స్పష్టం చేశారు.
ప్రాజెక్టు అంచనా వ్యయం అకస్మాత్తుగా పెరగడంపై కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. తొలుత రూ.16,000 కోట్లుగా ఉన్న అంచనా వ్యయం, ఇప్పుడు రూ.1.5 లక్షల కోట్లకు ఎలా చేరిందని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బహిరంగంగా చెబుతున్న గణాంకాలకు, అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివరాలకు మధ్య పొంతన లేదని ఆయన విమర్శించారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 10,000 ఇళ్లను కూల్చివేయాలని, 3,260 ఎకరాల భూమిని సేకరించాలని గెజిట్ నోటిఫికేషన్లు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు. బఫర్ జోన్ పరిధిని ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతున్నారని, హనుమాన్ నగర్ వంటి దూర ప్రాంతాలకు కూడా నోటీసులు ఇవ్వడం వెనుక ఉన్న హేతుబద్ధత ఏమిటని ప్రశ్నించారు.
ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ విషయంలో ప్రభుత్వం పారదర్శకత పాటించడం లేదని బీఆర్ఎస్ ఆరోపించింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారుల వద్ద కూడా స్పష్టమైన డీపీఆర్ లేదని, ఒకవేళ ఉంటే దానిని తక్షణమే సభ ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. డీపీఆర్ తయారీ బాధ్యతను పలు దేశాల్లో నిషేధానికి గురైన 'మెయిన్ హార్ట్' అనే సంస్థకు అప్పగించారని, సాధారణంగా 18 నెలలు పట్టే నివేదికను కేవలం రెండు నెలల్లోనే ఎలా పూర్తి చేశారని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నుండి రుణం మంజూరైందని ప్రభుత్వం చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని, మార్చి 11 వరకు ఎటువంటి నిధులు మంజూరు కాలేదని ఏడీబీ అధికారులు స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
బాధిత ప్రజలతో నేరుగా చర్చించకుండా, ఫైవ్ స్టార్ హోటళ్లలో ప్రెజెంటేషన్లు ఇవ్వడం సరికాదని కేటీఆర్ విమర్శించారు. అందుకే అటువంటి సమావేశాలను తాము బహిష్కరించినట్లు తెలిపారు. పేదల ఇళ్లు, జీవనోపాధిని దెబ్బతీసేలా, పారదర్శకత లేకుండా తీసుకునే ఏ నిర్ణయాన్నైనా తమ పార్టీ అడ్డుకుంటుందని హెచ్చరించారు. ఈ చర్చలో సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, బండారు లక్ష్మారెడ్డి వంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొని ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.