ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారు, తెలంగాణకు తిరిగిచ్చేయాలి: కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik
ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారు, తెలంగాణకు తిరిగిచ్చేయాలి: కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కలిపిన గ్రామాల్లో ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. పోలవరం తెలంగాణపై జలఖడ్గం పేరుతో శుక్రవారం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ మేరకు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరిట ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్గఢ్ సీఎంలతో ప్రధాని మోడీ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ ఐదు గ్రామాలను వెనక్కి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయాలని కోరారు. కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే భవిష్యత్తులో కూడా ఐదు గ్రామాలకు రక్షణ ఉంటుందని, లేదంటే ఏ ఒక్క ఏడాదిలో కూడా భారీ వరదలు వస్తే అన్ని గ్రామాలు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముంపు ఏర్పడిందని సంచలన ప్రకటన చేశారు. భద్రాచలం రామాలయం మునిగిపోయే ప్రమాదంలో ఉందని తెలిపారు. పోలవరం స్పిల్ వే సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకోవడం వల్ల తెలంగాణకు బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుందని తెలిపారు. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రాచలం రాములవారి మాన్యం వెయ్యి ఎకరాలు ఉందని తెలిపారు. వెయ్యి ఎకరాల దేవుని మాన్యం ఆంధ్రాకి పోయింది.. దేవుడేమో తెలంగాణలో ఉన్నారని చెప్పుకొచ్చారు. అక్కడ పట్టించుకునే పరిస్థితి లేక దేవుని మాన్యం అన్యాక్రాంతం అవుతోందని, ఈ మేరకు దేవుని మాన్యాన్ని పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నంలో తెలంగాణ జాగృతి సుప్రీం కోర్టును ఆశ్రయించిందని తెలిపారు.
2014లో ప్రధాని మోడీ మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలో ఏడు మండలాలను ఏపీలో కలపడానికి ఆర్డినెన్స్ను ఆమోదించి అన్యాయం చేశారని ఆరోపించారు. ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారని, లోయర్ సిలేరు విద్యుత్తు ప్రాజెక్టును కూడా ఏపీకి అప్పజెప్పారని వాపోయారు. బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి చంద్రబాబు ఏడు మండలాలను తీసుకున్నారని ఆరోపించారు. ఇది విభజన చట్టానికి, రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమని అప్పుడే పార్లమెంటులో తాము గళమెత్తినట్లు గుర్తుకు చేశారు. నాడు కేసీఆర్ బంద్కు పిలుపునిచ్చినా కేంద్రానికి చీమకుట్టినట్టుగా లేదన్నారు.