కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్ణయంతో మహిళలకు తీరని అన్యాయం: ఎమ్మెల్సీ కవిత

మహిళల హక్కులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో మహిళలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు.

By అంజి  Published on  19 Feb 2024 7:30 AM GMT
BRS, MLC Kavitha , Telangana government, women reservation

కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్ణయంతో మహిళలకు తీరని అన్యాయం: ఎమ్మెల్సీ కవిత

మహిళల హక్కులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో మహిళలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ కొత్త జీవో తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు.

''సీఎం రేవంత్‌రెడ్డి.. మీరు రాజకీయాలపై పెట్టిన శ్రద్ధ రోస్టర్‌ పాయింట్‌పై పెట్టి ఉంటే బాగుండేది. రోస్టర్‌ పాయింట్‌ రద్దును సవాల్ చేస్తూ కేసీఆర్‌ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆగమేఘాల మీద ఆ కేసును ఎందుకు విత్‌డ్రా చేసుకున్నట్లు? మీరు కొత్త జీవో ఇచ్చేటప్పుడు మేధావులతో సంప్రదించారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు తీవ్ర అన్యాయం చేసే ఈ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నా'' బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ చేశారు.

ఈ అంశంపై జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆమె లేఖ రాశారు.

''1996లో అనేక పోరాటాల ఫలితంగా మహిళలకు ఉపాధి అవకాశాల్లో 33.3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబర్‌ 41, 56 జారీ అయ్యాయి. దీనికి 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఇందిరా సాహ్ని తీర్పు కూడా ఎంతో తోడ్పాటునిచ్చింది. ఆ తర్వాత రాజ్యంగబద్ధంగా మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు కల్పించారు. మన దేశంలో సామాజిక రిజర్వేషన్లు ఎలా అయితే ఉన్నాయో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేసే పద్ధతి నడుస్తోంది. మహిళలకు అవకాశాలు లేక, విద్యా ప్రమాణాలు అందుకోలేక కొన్నేండ్లపాటు కోల్పోయినప్పటికీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తోంది. ఇన్నేళ్ల నుంచి సాగుతున్న ఈ పద్ధతిని ఇటీవల రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకొని తెలంగాణలో మీ గ్యారెంటీతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తూ జీవో 41, 56ను రద్దు చేస్తూ ఈ నెల 10న కొత్తగా జీవో 3ను తీసుకువచ్చింది.

రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసినా.. తాము మహిళల హక్కులను హరించబోమని 2023 జనవరిలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరితో సంప్రదింపులు జరపకుండా మహిళల హక్కులకు భంగం కలిగిస్తూ ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. తద్వారా మహిళల హక్కులను సంపూర్ణంగా, శాశ్వతంగా హరిస్తూ రోస్టర్ పాయింట్లు లేకుండా హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్లను కల్పిండానికి జీవో 3ను ప్రభుత్వం జారీ చేసింది. ఇది మహిళల ఉద్యోగావకాశాలకు శరాఘాతంగా నిలవనుంది.

ఉదాహరణకు ఈ ఏడాది దాదాపు 2 లక్షల 50 వేల మంది ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో నమోదుచేసుకున్నారు. వారిలో లక్ష మంది ఆడబిడ్డలు ఉన్నారు. ఈ ఏడాది 2 లక్షల కొలువులు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నది. అంటే 33.3 శాతం రిజర్వేషన్ల మేరకు కనీసం 66 వేల మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు కచ్చితంగా రావాలి. అదనంగా మరింత మంది మహిళలకు ఉద్యోగాలు లభించాలి. అదే ఈ రిజర్వేషన్ల స్ఫూర్తి. దీనిని పక్కనబెడుతూ సీఎం రేవంత్ రెడ్డి కొత్త జీవో తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఒక ఆడబిడ్డగా, ఆడబిడ్డల హక్కుల కోసం మాట్లాడే వ్యక్తిగా తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాను. ఈ అంశంపై జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి. సుప్రీంకోర్టు తీర్పును పాటించబోమంటూ బీహార్, కర్ణాటక రాష్ట్రాలు జీవోలు జారీ చేశాయి. కానీ తెలంగాణలో మాత్రం మీ గ్యారెంటీతో ఇందిరమ్మ రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఇంటి ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతోంది. ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆ జీవోను తక్షణమే వెనక్కి తీసుకునేలా ముఖ్యమంత్రికి ఆదేశాలు జారీ చేయాలి'' అని విజ్ఞప్తి చేశారు.

Next Story