హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో మరోసారి షాక్ తగిలింది. ఓ బెదిరింపుల కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. కమలాపురం మండలం వంగపల్లిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్న మనోజ్ అనే వ్యాపారిని కౌశిక్ రెడ్డి బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. క్వారీ సక్రమంగా నడుపుకోవాలంటే తనకు రూ.50 లక్షలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారని మనోజ్ భార్య ఉమాదేవి హనుమకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న భావనతో పాడి కౌశిక్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం, పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న కౌశిక్ రెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చింది. కౌశిక్ రెడ్డి విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది.