విషాదం.. రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి

బీఆర్ఎస్‌ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత (33) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on  23 Feb 2024 2:12 AM GMT
brs, mla lasya nanditha, died,   accident ,

విషాదం.. రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి

బీఆర్ఎస్‌ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత (33) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై కారు అదుపుతప్పి రేలింగ్ఢీ‌ను కొట్టింది. దాంతో.. కారులో ఉన్న ఆమె తీవ్ర గాయాలపాలై చనిపోయారు. శుక్రవారం తెల్లవారుజామునే ఈప్రమాదం చోటుచేసుకుంది. ఇక ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడ్డ డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.

కాగా.. మేడ్చల్‌ నుంచి పటాన్‌చెరువు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు వల్లే రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిద్రమత్తులో ముందు వాహనాన్ని తప్పంచే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముందు వాహనాన్ని తప్పించే క్రమంలో సడెన్ బ్రేక్‌ వేయడం... దాంతో కారు అదుపుతప్పి ఔటర్‌ రింగ్‌రోడ్డు రేలింగ్‌ను ఢీకొట్టినట్లు చెబుతున్నారు. ఇక ఘటనాస్థలిలోనే ఎమ్మెల్యే లాస్య నందిత ప్రాణాలు కోల్పోయింది. సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.

బీఆర్ఎస్‌ యువ ఎమ్మెల్యే మృతితో తెలంగాణ రాజకీయాల్లో విషాదం నెలకొంది. లాస్య నందిత కంటోన్మెంట్‌ మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. లాస్య నందిత 2015లో కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే.. గత ఫిబ్రవరిలో సాయన్న గుండెపోటుతో చనిపోయారు. దాంతో.. ఆ స్థానం టికెట్‌ను బీఆర్ఎస్‌ ఆయన కుమార్తె లాస్య నందితకు ఇచ్చింది. గతేడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గణేశ్‌పై 17,169 ఓట్ల మెజార్టీతో లాస్య నందిత గెలిచారు. రాజకీయంగా మంచి భవిష్యత్‌ ఉందని భావిస్తున్న తరుణంలో.. చిన్న వయసులోనే రోడ్డుప్రమాదంలో చనిపోవడం అందరిలో విషాదాన్ని నింపింది. ఇక ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే రోడ్డుప్రమాదంలో లాస్య నందిత

ఫిబ్రవరి 13వ తేదీన నల్లగొండలో బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభలో పాల్గొన్న లాస్య నందిత తన కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే.. ఆ సమయంలో లాస్య నందిత కారు నార్కట్‌పల్లి వద్ద ఒక టిప్పర్‌ను ఢీకొట్టింది. అప్పుడు కారు ముందుభాగం ధ్వంసం అయ్యింది. ఎమ్మెల్యే లాస్యకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఎక్స్‌ వేదిగా అప్పుడు స్పందించిన లాస్య.. తాను బాగానే ఉన్నట్లు కూడా పేర్కొన్నారు. కానీ.. కొద్ది రోజుల వ్యవధిలోనే మరో రోడ్డుప్రమాదానికి గురవ్వడం.. ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో విషాదాన్ని నింపింది.

Next Story