సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ

సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్‌ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ రాశారు.

By Srikanth Gundamalla  Published on  8 April 2024 7:04 AM GMT
brs, mla harish rao, letter,  cm revanth reddy,

సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ

సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్‌ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ రాశారు. పొద్దు తిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించాలని కోరారు. అలాగే ప్రభుత్వం పూర్తిస్థాయిలో రైతుల వద్ద నుంచి పంటను కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

రైతులు పండించిన చివరి గింజ వరకు కనీస మద్దతు ధర రూ.6,760 చెల్లించి పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేయాలని హరీశ్‌రావు లేఖలో రాశారు. తెలంగాణలోని ఉమ్మడి మెదక్, నిజామాబాద్‌ జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని 20,829 ఎకరాల్లో ఈ సారి రైతులు పొద్దు తిరుగుడు పువ్వు పంట వేశారని హరీశ్‌రావు చెప్పారు. ఈ పంటకు మార్కెట్లో కనీస మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారని చెప్పారు. కేంద్రం సమకూర్చిన నిధుల మేరకే కొనుగోలు చేసి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాల్సిన వాటా గురించి మౌనంగా ఉండటం సరికాదని అన్నారు. ఇలా చేయడం ద్వారా 75 శాతం పంటను రైతులు చాలా తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని చెప్పారు. ఇది రైతులను అవమానించడమే అని హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 1,65,800 క్వింటాళ్ల పొద్దు తిరుగుడు పంట దిగుబడి వస్తుందని హరీశ్‌రావు చెప్పారు. కేంద్రం నిధులతో కేవలం 37వేల క్వింటాళ్లు మాత్రమే కొనడానికి అంగీకరించిందన్నారు. అంటే మొత్తం 25 శాతం మాత్రం కేంద్రం ఈ పంటను కొనుగోలు చేస్తుందనీ.. మిగతా 75 శాతం పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులు నష్టపోకుండా మద్దతు ధర ఇచ్చి పంటను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

అలాగే ఈసారి కూడా చివరి గింజ వరకు కనీస మద్దతు ధర రూ.6,760 చెల్లించి పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేయాలని హరీశ్‌రావు లేఖ ద్వారా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి పంటను కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు కేవలం నాలుగైదు వేలకే తమ పంటను అమ్ముకుని నష్టపోతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పొద్దు తిరుగుడు పువ్వు పంటను వేసిన రైతులకు అండగా నిలవాలని సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో హరీశ్‌రావు పేర్కొన్నారు.


Next Story