హిందీ భాషపై దేశ వ్యాప్తంగా చర్చ, వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హిందీ జాతీయ భాష కాదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో 22 అధికారిక, 300 అనధికారిక భాషలు ఉన్నాయన్నారు. హిందీ ప్రమోషన్కు రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నారని, మరీ ఇతర భాషలను ఎందుకు పట్టించుకోవట్లేదన్నారు.
తాము తెలుగును మీపై రుద్దనప్పుడు.. మీరు తమపై హిందీని ఎందుకు రుద్దుతున్నారని అని కేటీఆర్ ప్రశ్నించారు. హిందీ నేర్చుకోవాలా? వద్దా అనేది ప్రజలకు వదిలేయండి అంటూ ఫైరయ్యారు. భారత్కు జాతీయ భాష అవసరం లేదని అన్నారు. జైపూర్లో ఓ మీటింగ్లో పాల్గొన్న కేటీఆర్.. అక్కడ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఇక ఇటీవల ఏపీ మంత్రి నారా లోకేష్ హిందీ జాతీయ భాష అని పేర్కొన్న విషయం తెలిసిందే. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి లోకేష్ హిందీ జాతీయ భాషేనని పేర్కొన్నారు. దానిని సమర్థించిన వాళ్లున్నారు, విమర్శించిన వాళ్లున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా.. హిందీ జాతీయ భాషేనా అంటూ రిపోర్టర్లను ప్రశ్నించగా.. హిందీ కచ్చితంగా జాతీయ భాషే, అందులో చర్చించడానికి ఏముంది అని సమధానం ఇచ్చారు.