కొండా సురేఖ ఏడిస్తే మాకు సంబంధం లేదు: కేటీఆర్

తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  2 Oct 2024 10:30 AM GMT
కొండా సురేఖ ఏడిస్తే మాకు సంబంధం లేదు: కేటీఆర్

తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ వరుసగా బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన గురించి సోషల్ మీడియాలో అవహేళన చేసేలా బీఆర్ఎస్ పోస్టులు పెడుతోందంటూ మండిపడ్డారు. అంతేకాదు.. తాజాగా కేటీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. హీరోహీరోయిన్లు కేటీఆర్ వల్లే కొందరు విడిపోయారని అన్నారు. తాజాగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. మంత్రి కొండా సురేఖకు కౌంటర్ ఇచ్చారు.

హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని కొండా సురేఖ అనలేదా? అని ప్రశ్నించారు. తనకూ కుటుంబం, భార్యాపిల్లలు లేరా? అని కేటీఆర్ నిలదీశారు. ఆమెపై సోషల్ మీడియా పోస్టులతో తమకు సంబంధం లేదని చెప్పారు కేటీఆర్. కొండా సురేఖ ఏడిస్తే తమకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తమపై కూడా అభ్యంతరకర ఆరోపణలు చేసినప్పుడు తమ ఇంట్లో ఆడవాళ్లు బాధపడరా? వారు ఏడవరా? అని మంత్రి కొండా సురేఖను కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటిదాకా మాట్లాడిన బూతులను గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. వారు తిట్టినప్పుడు ఇతరుల మనోభావాలు దెబ్బతినలేదా? అని ప్రశ్నించారు. కొండా సురేఖ, సీతక్కలు సీఎం రేవంత్ రెడ్డి నోరును ఫినాయిల్‌తో కడగాలని కేటీఆర్ సూచించారు.

సోషల్ మీడియాలో కేసీఆర్‌ను తిట్టిపోసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని కేటీఆర్ ప్రశ్నించార. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక దాడులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ లేకుండా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబులు మూసీ ప్రాంతంలో తిరగాలని సవాల్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు.

Next Story