రఘునందన్‌ రావు తప్పుడు మాటలు మానుకోవాలి: హరీశ్‌రావు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

By Srikanth Gundamalla  Published on  1 May 2024 7:45 AM GMT
brs, harish rao, bjp, raghunandan rao, election campaign,

రఘునందన్‌ రావు తప్పుడు మాటలు మానుకోవాలి: హరీశ్‌రావు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. విమర్శలు, ప్రతివిమర్శల తీవ్రత పెరుగుతూనే ఉంది. తెలంగాణలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నాయకులు తమ సొంత పార్టీలకు గుడ్‌ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరారు. అయితే.. సిద్దిపేటలో మెదక్‌ బీఆర్ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తరఫున మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మాజీమంత్రి హరీశ్‌రావు బీజేపీ నాయకులపై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమ అభ్యర్థిపై తప్పుడు ప్రచారం చేసి ఓట్లు అడుగుతున్నారంటూ మండిపడ్డారు. రఘునందన్‌రావు తప్పుడు మాటలు ఇకనైనా మానుకోవాలని హరీశ్‌రావు హితవు పలికారు.

మెదక్‌ లోక్‌సభ పరిధిలో బీఆర్ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ప్రజలు అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారని హరీశ్‌రావు చెప్పారు. బీఆర్ఎస్‌పై బీజేపీ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారనీ... వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గతంలో దబ్బాక నుంచి నకిలీ వీడియోలు చేసి వదిలారంటూ హరీశ్‌రావు గుర్తు చేశారు. బీజేపీ అబద్ధాలు విని, వీడియోలను చూసి ప్రజలు మోసపోవద్దంటూ ఈ మేరకు హరీశ్‌రావు సూచనలు చేశారు. వెంకట్రామిరెడ్డి నిబద్ధత ఉన్న నాయకుడు అనీ.. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారనీ చెప్పారు. గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలో బీజేపీ తప్పుడు ప్రచారాలు చేసే గెలిచిందనీ.. ఈసారి కూడా అదే ప్రయత్నం చేస్తుందనీ అన్నారు. కానీ.. ఈ సారి ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలంటూ హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

Next Story