ఆషాఢమాసం బోనాలు: గోల్కొండ కోటలోని మహంకాళీ ఆలయ మెట్లకు పూజలు
హైదరాబాద్లో ఆషాఢ మాసం బోనాలు గురువారం నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి.
By Knakam Karthik
ఆషాఢమాసం బోనాలు: గోల్కొండ కోటలోని మహంకాళీ ఆలయ మెట్లకు పూజలు
హైదరాబాద్లో ఆషాఢ మాసం బోనాలు గురువారం నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. చారిత్రాత్మక గోల్కొండ కోట జగదాంబికా మహంకాళి ఎల్లమ్మ ఆలయంలో ప్రారంభమయ్యే తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు నెల రోజుల పాటు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ సంబరాలకు జంట నగరాల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించడానికి వస్తారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు.. దేవాదాయ శాఖ అధికారులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
గోల్కొండ కోట వద్ద నీటి ట్యాంకర్లు, క్యూలైన్ల కోసం తాత్కాలిక బారికేడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఆలయానికి వెళ్లే దారిలో రోడ్లుకు మరమ్మతులు చేపడుతున్నారు. గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయం తెలంగాణలో బోనాల ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఈ పండుగ ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత వచ్చే ఆషాఢ మాసంలో తొలి గురువారం, ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం జూన్ 26(రేపు) బోనాల పండుగ ప్రారంభం కానుంది. దీంతో ఈ రోజు అమావాస్యం కావడంతో గోల్కొండలోని జగదాంబికా ఆలయ మార్గంలోని మెట్లకు బుధవారం.. పెద్ద ఎత్తున మహిళలు పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు.