బీజేపీ ఎంపీకి మరోసారి బెదిరింపులు, దమ్ముంటే కాపాడుకోవాలని ఫోన్ కాల్
మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపుల పర్వం కొనసాగుతుంది. ఇ
By Knakam Karthik
బీజేపీ ఎంపీకి మరోసారి బెదిరింపులు, దమ్ముంటే కాపాడుకోవాలని ఫోన్ కాల్
మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపుల పర్వం కొనసాగుతుంది. ఇటీవల కాలికి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనకు, మరోసారి ప్రాణహాని తలపెడతామంటూ మళ్లీ హెచ్చరికలు వచ్చాయి. ఆపరేషన్ కగార్ నిలిపివేయకపోతే చంపేస్తామని మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. తమ మనుషులంతా హైదరాబాద్లో ఉన్నారని.. దమ్ముంటే కాపాడుకోవాలని సవాల్ విసిరారు. కాగా రెండ్రోజుల క్రితం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో రఘునందన్ కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఈ ఫోన్ కాల్ వచ్చింది.
ఆదివారం రెండు వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి కాల్స్ చేసిన ఆగంతకులు, ఛత్తీస్ గఢ్ లో 'ఆపరేషన్ కగార్'ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తాము ఏపీ మావోయిస్టు కమిటీకి చెందిన వారిమని, తమ ఆదేశాల మేరకు ఐదు ప్రత్యేక బృందాలు ఇప్పటికే హైదరాబాద్లో రంగంలోకి దిగాయని వారు చెప్పినట్టు సమాచారం. "మా టీమ్లు నగరంలోనే ఉన్నాయి. మరికాసేపట్లోనే నిన్ను చంపేస్తాం. దమ్ముంటే నిన్ను నువ్వు కాపాడుకో" అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
జూన్ 23న మొదటి బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో తెలంగాణ డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు రఘునందన్ ఫిర్యాదు చేశారు. ఈ బెదిరింపు కాల్స్పై క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసు శాఖ, ఆయనకు అదనపు భద్రత అవసరమని నిర్ణయించింది. ఈ మేరకు రఘునందన్ రావుకు అదనపు భద్రత కల్పించాలని మెదక్ జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.