గుడ్‌న్యూస్‌.. కరీంనగర్-తిరుపతి రైలు ఇక వారానికి 4 రోజులు

కరీంనగర్‌-తిరుపతి మధ్య నడిచే రైలు ఇకపై వారానికి 4 రోజులు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

By Srikanth Gundamalla
Published on : 22 Dec 2023 5:42 PM IST

bjp, mp bandi sanjay,  railway minister,  delhi,

గుడ్‌న్యూస్‌.. కరీంనగర్-తిరుపతి రైలు ఇక వారానికి 4 రోజులు

బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. కరీంనగర్‌-తిరుపతి మధ్య నడిచే రైలు ఇకపై వారానికి 4 రోజులు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో ఎంపీ బండి సంజయ్ పర్యటించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే భక్తులు ఇబ్బందులు పడుతున్నారనీ చెప్పారు. అంతేకాదు.. ఇతర రైల్వే సంబంధిత సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లానని బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్-తిరుపతి మధ్య రైలును ఇక నుంచి వారానికి నాలుగు రోజుల నడపాలని ఆదేశాలు ఇస్తానని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారని బండి సంజయ్ అన్నారు. కాగా.. కరీంనగర్-తిరుపతి మధ్య ప్రస్తుతం వారానికి రెండ్రోజుల మాత్రమే నడుస్తోంది.

రైల్వేకు సంబంధించి మరిన్ని సమస్యలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు వివరించానని ఎంపీ బండి సంజయ్ తెలిపారు. పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్‌లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని.. దాంతో సమస్యలు ఎదురవుతున్నాయని.. దీన్ని పరిష్కరించాలని అశ్విని వైష్ణవ్‌కు చెప్పానన్నారు. అవసరమైన చోట రోడ్‌ అండర్‌ బ్రిడ్జి డ్రైనేజీలు మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు. దీనికి కూడా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారనీ.. తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారని బండి సంజయ్ అన్నారు. అలాగే కరీంనగర్-హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్‌ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు అశ్విని వైష్ణవ్ చెప్పారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ వద్ద తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌, నవజీవన్ ఎక్స్‌ప్రెస్, గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరిన్ని రైళ్లకు హాల్ట్‌ కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ హామీ ఇచ్చారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ తెలిపారు.

Next Story