అసమానతలను అధిగమించి.. TSWREIS విద్యార్థుల IIT కలలకు రెక్కలు

Beating odds TSWREIS students give wings to their IIT dreams.ఐఐటీ-జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో తెలంగాణ సాంఘిక

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 July 2022 2:54 AM GMT
అసమానతలను అధిగమించి.. TSWREIS విద్యార్థుల IIT కలలకు రెక్కలు

హైదరాబాద్: ఐఐటీ-జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. సోమ‌వారం ఉద‌యం ఈ ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. సాంఘిక సంక్షేమ విద్యాసంస్థలకు చెందిన 35 మంది విద్యార్థులు 90 శాతానికిపైగా, 581 మంది విద్యార్థులు 40 శాతానికిపైగా ఉత్తీర్ణత సాధించారు. ఈ విద్యార్థుల‌లో కొంతమంది తల్లిదండ్రులు తమ జీవనోపాధి కోసం కూలీలుగా, మేస్త్రీలుగా, ఆటో రిక్షా డ్రైవర్లుగా, సెక్యూరిటీ గార్డులుగా మరియు కూరగాయల వ్యాపారులుగా పని చేస్తున్నారు.

రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో 97.2 శాతంతో గౌలిదొడ్డి బాలుర జూనియర్ కళాశాలకు చెందిన నారదాస్ శివ ప్రథమ స్థానంలో నిలవగా, గౌలిదొడ్డి బాలికల జూనియర్ కళాశాలకు చెందిన కావలి సాత్విక (96.8%), గోపి వర్షిణి (96.7%) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ సెక్రటరీ రోనాల్డ్ రోస్ టాపర్‌లను అభినందించారు. సెక్రటరీ రోనాల్డ్ రోస్ ఉపాధ్యాయుల అంకిత‌భావాన్ని, నిరుపేద విద్యార్థుల ఆకాంక్షలను నెరవేర్చ‌డానికి, ఉత్తమ కార్పొరేట్ కళాశాలలతో సమానంగా ఐఐటి ఔత్సాహికులకు అత్యున్నత స్థాయి కోచింగ్‌ను అందించడానికి నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ప్రశంసించారు.

"ప్రతి సంవత్సరం, వందలాది మంది విద్యార్థులు ప్రభుత్వ మద్దతుతో IITలు / NITS మరియు వైద్య కళాశాలల్లో చేరుతున్నారు. 2021లో 142, 239 మంది విద్యార్థులు వరుసగా ప్రీమియర్ IITలు / NITS మరియు మెడికల్ కాలేజీలలో సీట్లు సాధించారు. తెలంగాణలోని అట్టడుగు విద్యార్థుల జీవితాల్లో మార్పు, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యార్థుల విజయగాథలు.. సరైన అవకాశాలు లభిస్తే గ్రామీణ పల్లెల్లోని పేద విద్యార్థులు కూడా తమ ఐఐటీ కలలను సాధించగలరనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. నాణ్యమైన విద్య అందించబడుతుంది" అని సెక్రటరీ రోనాల్డ్ రోస్ అన్నారు.

Next Story