సెక్యూరిటీతో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్న బర్రెలక్క (శిరీష)

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  30 Nov 2023 5:59 AM GMT
barrelakka voting, telangana, elections ,

సెక్యూరిటీతో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్న బర్రెలక్క (శిరీష)

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 119 నియోజకవర్గాలకు ఒకేసారి ఓటింగ్ జరుగుతోంది. అయితే.. ఈ ఎన్నికల కోసం అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అయినా.. అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీల నేతల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డ కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క సెన్షేషన్‌గా మారిన విషయం తెలిసిందే. ఆమె తన స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బర్రెలక్క పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఆమె కుటుంబ సభ్యులపై గతంలో దాడి జరిగింది. దాంతో.. ఆమెకు సెక్యూరిటీ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే బర్రెలక్కకు ఎన్నికల సంఘం అధికారులు సెక్యూరిటీని ఇచ్చింది. సెక్యూరిటీతో వెళ్లి బర్రెలక్క పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బర్రెలక్క ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని.. తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పట్టణాల నుంచి సొంత స్థలాలకు భారీగా వెళ్తున్నారు. అయితే.. హైదరాబాద్‌లో మాత్రం ఓటింగ్ శాతం ఎప్పటిలానే తక్కువగానే ఉంది. ఉదయం 9 గంటలు వరకు 5 శాతం లోపే ఎన్నికల పోలింగ్ శాతం నమోదు అయ్యింది. మరోవైపు తెలంగాణలో ఓటు హక్కు కలిగి ఉండి ఏపీలో ఉన్న ఓటర్లు వస్తుండటంతో హైదరాబాద్ - విజయవాడ హైవేపై రద్దీ కనిపిస్తోంది.

Next Story