రాజీనామాకు 'సై'.. సీఎం కేసీఆర్‌, బండి సంజయ్‌ సవాళ్లు.!

Bandi Sanjay challenged CM KCR regarding meters for agricultural motors. వ్యవసాయ మోటార్లకు మీటర్లు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి

By అంజి  Published on  13 Sep 2022 6:41 AM GMT
రాజీనామాకు సై.. సీఎం కేసీఆర్‌, బండి సంజయ్‌ సవాళ్లు.!

వ్యవసాయ మోటార్లకు మీటర్లు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లులో మీటర్లు బిగించే ప్రసక్తే లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బిల్లు ప్రతులను సీఎంకు పంపుతామని తెలిపారు. బిల్లుల్లో మీటర్ల బిగింపు అంశం ఉన్నట్లు చూపితే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఒక వేళ ఆ అంశం లేకపోతే కేసీఆర్ తన పదవికి రాజీనామా చేస్తారా? అంటూ బండి సంజయ్‌ ప్రశ్నించారు.

సోమవారం నాల్గవ విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా రాంలీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో సంజయ్ ప్రసంగించారు. కరెంటు బకాయిలు చెల్లించలేక డిస్కమ్‌ను మూసేసేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని, కేంద్రంపై నిందలు మోపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 30 గ్రామాలకు సరిపోయే విద్యుత్‌ను కేసీఆర్ తన ఫాంహౌస్‌కు వినియోగిస్తున్నారని విమర్శించారు.

మూసీ నదిని ప్రజలు తాగేలా ప్రక్షాళన చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేసిన బండి సంజయ్.. కేసీఆర్ కనీసం మూసీ నీళ్లలో స్నానం చేస్తారా అని సవాల్ విసిరారు. న్యాయం కోసం పోరాడుతున్న కొందరు వీఆర్‌ఏలు చనిపోయినా కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకుని నలుగురు మహిళలు మృతి చెందినా వైద్యారోగ్యశాఖ డైరెక్టర్‌, ఆరోగ్యశాఖ మంత్రిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

కేంద్రం కుట్ర చేస్తోంది: కేసీఆర్‌

వ్యవసాయం, విద్యుత్ రంగాలను కార్పొరేట్లకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు. సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైల్వేలు, ఎల్‌ఐసీ, విమానాశ్రయాలు తదితరాలను ప్రైవేటీకరించిందని, ఇప్పుడు వ్యవసాయం, విద్యుత్ రంగాలు మాత్రమే మిగిలాయని అన్నారు. ఎరువుల ధరలు పెంచారని ఆరోపించారు. కరెంట్ బోర్లకు మీటర్లు తప్పనిసరి. చివరకు రైతులు వ్యవసాయం చేయలేకపోగా, కార్పొరేట్ వ్యక్తులు ప్రవేశిస్తారు. బీజేపీ నేత రఘునందన్ అసత్యాలు చెబుతూ అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణకు ఏపీ విద్యుత్ శాఖ రూ.17,828 కోట్లు చెల్లించాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్‌లో తెలంగాణ వాటా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి రూ.3 వేల కోట్ల బకాయిలు, రూ. 3 వేల కోట్ల వడ్డీతో సహా రూ.6 వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందని కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం రూ.17,828 కోట్లు చెల్లించాల్సి ఉన్నందున రూ.6 వేల కోట్లు మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని చెల్లించవచ్చని కేసీఆర్ చెప్పారు. విద్యుత్ విషయంలో తన గణాంకాలు తప్పని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

Next Story